![]() |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్, విజయవాడ |
ఆంధ్ర సహకార సమ్మేళనం, ‘బెజవాడ’ 1919వ సంవత్సరంలో స్వర్గీయ భోగరాజు
పట్టాభి సీతారామయ్య గారి ఆద్వర్యంలో పదముగ్గురితో స్థాపించబడినది. 1953 వ
సంవత్సరంలో రాజమండ్రికి మారి ఆంధ్ర సహకార యూనియన్ గా ఆంధ్ర మరియు రాయలసీమ
సహకారవేత్తల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధిచెంది సహకార విద్యాప్రచార
ప్రబోధం మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది.
1920 డిసెంబర్ 5వ తేదీన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వాన
“సహకారము” మాసపత్రిక ప్రారంభించబడినది. 1920 నుండి 1966 వరకు స్వపరిపాలనా
సంస్థగా, స్వయం సహాయం, పరస్పర సహాయం అను విలువలతో జైత్రయాత్ర సాగిస్తూ
వచ్చింది. రాజమండ్రి, విజయవాడ, అనంతపురం సహకార శిక్షణా కేంద్రాలలో శిక్షణ
పొందిన వారికి డిప్లోమాలను జారిచేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహకార
యూనియన్ 1953 లో ముద్రణశాఖను తన కార్యకలాపములలో చేర్చుకొన్నది.
1956 నవంబర్ 1 వ తేదీన సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది. 1966
సంవత్సరము జనవరి 10 వ తేదీన ఆంధ్రదేశ సహకార యూనియన్, రాజమండ్రి మరియు
హైదరాబాద్ కేంద్ర సహకార సమితి లి., హైదరాబాద్ సంస్థల విలీనీకరణ ఫలితంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్., హైదరాబాద్ గా రిజిష్టరు
చేయబడి, గన్ ఫౌండ్రి ప్రధాన కార్యాలయంగా కార్యక్రమాలను విజయవంతంగా
నిర్వహిస్తూ వచ్చింది. హైదరాబాద్ సహకార శిక్షణా కేంద్రంతో కలిపి 4
శిక్షణా కేంద్రాలు ఉండగా, తదుపరి కడప జిల్లా ప్రొద్దుటూరు మరియు వరంగల్
లలో కూడా సహకార శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.
ది.02.06.2014వ తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. ది.16.05.2016 వ
తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్., విజయవాడ రిజిష్టరు
చేయబడినది. పోరంకి, విజయవాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార విద్య, శిక్షణా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నది. వివిధ అంశములకు సంబంధించి మెటిరియల్ ను రూపొందించి,
వివిధ సహకార సంఘాల పాలకవర్గసభ్యులకు, సిబ్బందికి, బ్యాంకు సిబ్బందికి,
సహకార శాఖ సిబ్బందికి స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నది. భారత జాతీయ సహకార యూనియన్ వారి సౌజన్యంతో సెమినార్లు
నిర్వహిస్తున్నది. అఖిల భారత సహకార వారోత్సవాలు, అంతర్జాతీయ సహకార
దినోత్సవములను నిర్వహించుటలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నది.