![]() |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్, విజయవాడ |
ఆంధ్ర సహకార సమ్మేళనం, ‘బెజవాడ’ 1919వ సంవత్సరంలో స్వర్గీయ భోగరాజు
పట్టాభి సీతారామయ్య గారి ఆద్వర్యంలో పదముగ్గురితో స్థాపించబడినది. 1953 వ
సంవత్సరంలో రాజమండ్రికి మారి ఆంధ్ర సహకార యూనియన్ గా ఆంధ్ర మరియు రాయలసీమ
సహకారవేత్తల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధిచెంది సహకార విద్యాప్రచార
ప్రబోధం మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది.
1920 డిసెంబర్ 5వ తేదీన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వాన
“సహకారము” మాసపత్రిక ప్రారంభించబడినది. 1920 నుండి 1966 వరకు స్వపరిపాలనా
సంస్థగా, స్వయం సహాయం, పరస్పర సహాయం అను విలువలతో జైత్రయాత్ర సాగిస్తూ
వచ్చింది. రాజమండ్రి, విజయవాడ, అనంతపురం సహకార శిక్షణా కేంద్రాలలో శిక్షణ
పొందిన వారికి డిప్లోమాలను జారిచేస్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహకార
యూనియన్ 1953 లో ముద్రణశాఖను తన కార్యకలాపములలో చేర్చుకొన్నది.
1956 నవంబర్ 1 వ తేదీన సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది. 1966
సంవత్సరము జనవరి 10 వ తేదీన ఆంధ్రదేశ సహకార యూనియన్, రాజమండ్రి మరియు
హైదరాబాద్ కేంద్ర సహకార సమితి లి., హైదరాబాద్ సంస్థల విలీనీకరణ ఫలితంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్., హైదరాబాద్ గా రిజిష్టరు
చేయబడి, గన్ ఫౌండ్రి ప్రధాన కార్యాలయంగా కార్యక్రమాలను విజయవంతంగా
నిర్వహిస్తూ వచ్చింది. హైదరాబాద్ సహకార శిక్షణా కేంద్రంతో కలిపి 4
శిక్షణా కేంద్రాలు ఉండగా, తదుపరి కడప జిల్లా ప్రొద్దుటూరు మరియు వరంగల్
లలో కూడా సహకార శిక్షణా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.
ది.02.06.2014వ తేదీన తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. ది.16.05.2016 వ
తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్., విజయవాడ రిజిష్టరు
చేయబడినది. పోరంకి, విజయవాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార విద్య, శిక్షణా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నది. వివిధ అంశములకు సంబంధించి మెటిరియల్ ను రూపొందించి,
వివిధ సహకార సంఘాల పాలకవర్గసభ్యులకు, సిబ్బందికి, బ్యాంకు సిబ్బందికి,
సహకార శాఖ సిబ్బందికి స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను
నిర్వహిస్తున్నది. భారత జాతీయ సహకార యూనియన్ వారి సౌజన్యంతో సెమినార్లు
నిర్వహిస్తున్నది. అఖిల భారత సహకార వారోత్సవాలు, అంతర్జాతీయ సహకార
దినోత్సవములను నిర్వహించుటలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నది.
Diploma in Cooperative Management & Computer Applications Course ను ప్రతి సంవత్సరము 6 మాసముల శిక్షణ కాలముగా నిర్ణయించి శిక్షణ ఇచ్చుట జరుగుచున్నది. 4 శిక్షణా కేంద్రములలో విజయవాడ, రాజమహేంద్రవరం, కడప మరియు అనంతపురం శిక్షణ ఇచ్చుచున్నాము. 2018-2019 గాను మొత్తము 215 మందికి 4 శిక్షణా కేంద్రాలలో శిక్షణ ఇచ్చుట జరిగినది. 2019-2020 నకు సంబంధించి నాల్గవ బ్యాచ్ 04.07.2019 న ప్రారంభము కానున్నది.
సహకార విద్యాకార్యక్రమములో భాగంగా సహకార సంఘాల సభ్యులకు, సహకార యూనియన్ విద్యాధికారులు వెళ్ళి విద్యను అందించడం జరుగుతుంది. దీని కోసము “సహకార విద్యా వికాసం” పుస్తకాన్ని సరళంగా, సులభంగా అర్ధం చేసుకొనే విధంగా తయారు చేయించి సభ్యులకు ఉచితముగా పంపిణి చేయుచున్నాము. రాష్ట్రములో గల వివిధ సహకార సంఘాల సభ్యులకు సహకార విద్యను అందించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను ప్రతి సంవత్సరము తయారు చేసుకొనుచున్నాము.
ప్రతి సంవత్సరము 14 నవంబర్ నుండి 20 నవంబర్ వరకు రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాలలో “భారత జాతీయ సహకార యూనియన్ (NCUI)” వారి సూచన ప్రకారం అఖిల భారత సహకార వారోత్సవాలలో రోజుకు ఒక ప్రత్యేక అంశాన్ని పురస్కరించుకొని సంఘాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించుచున్నాము. అన్ని సంఘాలలో సహకార స్ఫూర్తి, సహకార విద్యావ్యాప్తి సహకార వారోత్సవాలు నందు విరివిగా జరుగుచున్నది. సహకార వారోత్సవాలు నందు సహకార సంఘ సభ్యులు, మేనేజింగ్ కమిటీ వారు ఉత్సాహంగా పాల్గొని సంఘాల పనితీరును గురించి సమీక్షించి, తెలుసుకొని, సహకార అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుచున్నారు. అలాగే ప్రతి సంవత్సరము జూలై 7 వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుచున్నాము.
ఆంధ్రప్రదేశ్ సహకార యూనియన్ నందు ప్రతి సంవత్సరము జిల్లా స్థాయిలో వార్షిక ప్రణాళిక రూపొందించి శిక్షణ ఇవ్వడం జరుగుచున్నది. జిల్లా స్థాయిలో సహకార రంగంలో పనిచేస్తున్న మేనేజింగ్ కమిటీ మెంబర్లకు మరియు సహకార సంఘాల అధ్యక్షులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, సహకార బ్యాంకుల సూపర్ వైజర్స్ మరియు సహకార శాఖ సిబ్బందికి వార్షిక ప్రణాళిక ద్వారా శిక్షణ ఇవ్వటం జరుగుచున్నది. ఈ శిక్షణ కొరకు సహకార సంఘముల కమీషనర్ మరియు రిజిష్ట్రారు వారు, తగు అనుమతులు మంజూరు చేసి సహకార ఉద్యమ వ్యాప్తికి, శిక్షణకు కూడా విశేష కృషి చేస్తున్నారు. అలాగే సహకార సంఘాల అధ్యక్షులు తమ వంతు సహకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సహకార యూనియన్ నందు ఇప్పటి వరకు 1333 మంది సభులుగా ఉన్నారు మరియు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము నిరంతరాయముగా కొనసాగుచున్నది.
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964 ప్రకారం సహకార సంఘములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ కు సహకార విద్యానిధి చెల్లించవలసియున్నది. రూలు 36-A ను అనుసరించి సహకార సంఘములు ఆయా తరగతులకు నిర్దేశించిన విధముగా సహకార విద్యానిధికి ప్రతి సంవత్సరం నిధిని కేటాయించి, అందునుండి 30% సహకార యూనియన్ కు చెల్లించవలసి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వ ఆర్ధిక సహాయముతో “సహకార సమాచారము” పేరుతో మాస ప్రతిక నడుపుచున్నది. ఈ పత్రిక యందు సహకార రంగంలో వచ్చుచున్న మార్పులు – చేర్పులు, ప్రాధమిక సహకార సంఘాలకు మరియు ఇతర సహకార సంఘాలకు అవసరమగు సూచనలు, సమాచారము ముద్రించి సభ్య సంఘములకు, ప్రజా ప్రతినిధులకు, సహకార అధికారులకు పంపుచున్నాము.
సహకార సమాచార ప్రతుల కొరకుసహకార ఉద్యమ వ్యాప్తికి విస్తృత ప్రచారం చేయడానికి గాను శిక్షణార్ధులకు కావలసిన పాట్యప్రణాళికలను, పుస్తకములను ముద్రింపజేసి ఉచితంగా పంపిణి చేయుచున్నాము.
“భారత జాతీయ సహకార యూనియన్ (NCUI)”, న్యూఢిల్లీ వారి సహకారంతో రాష్ట్రంలో వివిధ చోట్ల మహిళాభ్యున్నతికి ముఖ్యంగా బలహీన వర్గాల మహిళల ఆర్ధిక, సామజిక అభివృద్ధికి సెమినార్లు నిర్వహించడం జరుగుచున్నది.
సహకార రంగ కార్యకలాపాలపై మరింత నైపుణ్యము పొంది శిక్షణార్ధులను సహకార అంశాలపై తీర్చిదిద్దేందుకు గాను సహకార విద్యాధికారులను, శిక్షణా కేంద్రాల ఉపన్యాసకులను మన యూనియన్ నుండి NCUI, న్యూఢిల్లీ కి పంపి శిక్షణ ఇప్పించడం జరిగింది.